తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న 'మంత్ర 2' సినిమాను తమిళ ప్రేక్షకుల ముందుంచడానికి కూడా దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు కారణం ఇటీవల కాలంలో అక్కడ కూడా దెయ్యాల సినిమాలకి ఆదరణ విపరీతంగా పెరిగిపోవడమే. అంతే కాకుండా గతంలో ఛార్మీ చేసిన 'మంత్ర' తెలుగులోనే కాదు, తమిళ్లోను అనూహ్యమైన విజయాన్ని సాధించింది. అందువలన 'మంత్ర 2' సినిమాను అక్కడ కూడా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన సతీష్, ఇది మంత్ర సినిమాకి మించిన ఉత్కంఠను కలిగిస్తుందని చెప్పాడు. గ్లామర్ విషయంలోనూ .. అభినయం విషయంలోను ఛార్మీకి ఎలాంటి వంక పెట్టలేమనీ, ఈ సినిమాతో మరో సక్సెస్ ఆమె ఖాతాలోకి చేరడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవల జ్యోతిలక్ష్మీగా సందడి చేసిన ఛార్మీ .. మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి చేస్తోన్న ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.