అఆ డిస్ట్రిబ్యూటర్ గా మంచి లాభాలందుకుని చాలా సంతోషంగా ఉన్నాడు దిల్ రాజు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ తన ఆనందాన్ని పంచుకున్న రాజు.. ఈ ఉత్సాహంలో ఇంకో ఇంట్రెస్టింగ్ డీల్ పూర్తి చేశాడు. ఈ ఏడాది ఇక రాబోయే సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ అనదగ్గ ?జనతా గ్యారేజ్? నైజాం హక్కుల్ని దిల్ రాజు సొంతం చేసేసుకున్నాడు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా హక్కుల కోసం విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ దిల్ రాజు ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి రైట్స్ తీసేసుకున్నాడు. ఈ డీల్ రూ.17 కోట్ల దగ్గర తెగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎన్టీఆర్ సినిమాల్లో రికార్డు. ?నాన్నకు ప్రేమతో నైజాం హక్కులు దాదాపు రూ.14.5 కోట్ల దాకా పలికాయి.
మరోవైపు తన ప్రొడక్షన్లో తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేశాడు దిల్ రాజు. శర్వానంద్ హీరోగా రైటర్ కం డైరెక్టర్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ?శతమానం భవతి? చిత్రాన్ని ఆగస్టు 20 ఆరంభించబోతున్నాడట రాజు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయినప్పటికీ ప్రస్తుతం శర్వానంద్ డెబ్యూ డైరెక్టర్ చంద్రమోహన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం నిర్విరామంగా పని చేస్తుండటంతో.. అది పూర్తయ్యాకే దిల్ రాజు సినిమాలోకి వస్తాడట. ఈ చిత్రాన్ని ముందు సాయిధరమ్ తో తీయాలనుకుని.. ఆ తర్వాత రాజ్ తరుణ్ ను హీరోగా అనుకుని చివరికి శర్వానంద్ తో ఫిక్సవ్వాల్సి వచ్చింది. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను ఈ ఏడాది ఆఖర్లో సెట్స్ మీదికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు రాజు.