రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో రూపొందిన అండర్ వాటర్ మెరైన్ వార్ డ్రామా ఘాజి ఈ నెల 17న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 1871లో పాకిస్థాన్ ఆర్మీ భారతీయ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను నాశనం చేయడానికి ఘాజి అనే సబ్ మెరైన్ ప్రయోగించడం వలన సంభవించిన యుద్ధ వాస్తవ కథనం ఆధారంగా నూతనదర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పట్ల అంతటా పాజిటివ్ టాక్ నడుస్తోంది. పైగా బాలీవుడ్ లో కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ చిత్ర ప్రీమియర్లకు మంచి స్పందన రావడం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది.
దీంతో ఘాజి టీమ్ ఏపి, తెలంగాణాల్లో కూడా స్పెషల్ ప్రీమియర్లకు ఏర్పాట్లు చేసింది. విడుదలకు ముందు 15వ తేదీన ఉదయం హైదరాబాద్లో, అదే రోజు సాయన్తరం విజయవాడలో ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు. అలాగే వైజాగ్ లాంటి ఇతర నగరాల్లో కూడా షోలు ఏర్పాట్లు చేయనున్నారు. సినిమాలో బలమైన కంటెంట్ ఉండటం వలన ప్రీమియర్లు లభిస్తాయని టీమ్ అభిప్రాయపడుతోంది.