ఒకప్పుడు వెండితెరపై మహారాణిగా వెలుగొందిన జయప్రద ఇప్పుడు నిజంగానే మహారాణిగా ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ శర్మ తెరకెక్కిస్తున్న ఒక భారీ చిత్రంలో ఆమె 'రాణీ సాహెబా'గా దర్శనమివ్వబోతుంది. ఈ పాత్ర ఆమె చేస్తేనే బాగుంటుందని దర్శకుడు పదే పదే కోరడంతో ఈ సినిమా చేయడానికి జయప్రద తన అంగీకారాన్ని తెలియజేసిందట. గతంలో 'సింహాసనం' చిత్రంలో ఆమె రాణి అలకనందాదేవిగా తెలుగు ప్రేక్షకులను అలరించింది. చాలాకాలం తరువాత తిరిగి హిందీ సినిమాలో మహారాణి పాత్రను చేస్తుండటం తెలుగు ప్రేక్షకులలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మహారాణి అంటే అందం .. అందుకు తగిన దర్పం ఉండాలి. చూపులతోనే ఆదేశాలు జారీ చేస్తుండాలి .. తన స్థాయిలో మంత్రాంగాలు నడుపుతుండాలి. ప్రతినాయిక ఛాయలతో రాణీ సాహెబా పాత్ర కూడా ఈ తరహాలోనే కొనసాగుతుందట. అందువలన ఈ హావభావాలను జయప్రద బాగా పలికిస్తుందని భావించిన సంజయ్ శర్మ, ఈ పాత్రకు ఆమెను ఒప్పించాడు. ఈ మధ్య కాలంలో రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ వచ్చిన జయప్రద, తక్కువగా అంగీకరిస్తోన్న చిత్రాల్లో ఇది ఒకటిగా కనిపిస్తోంది. దాంతో జయప్రద అభిమానులు ఈ సినిమా విశేషాల పట్ల ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. మహారాణిగా ఆమెను తెరపై చూసే క్షణం కోసం ఎదురు చూస్తునారు.