అగ్ర దర్శకుడు శంకర్ సారీ చెప్పారు. ఆయన తీస్తున్న రోబో 2.0 సెట్ లో చోటు చేసుకున్న ఒక ఘటనపై ఆయన క్షమాపణ చెప్పక తప్పలేదు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న రోబో2.0 షూటింగ్ స్పాట్ కు వచ్చిన ఫోటో జర్నలిస్టుపై చిత్రబృందం దాడి చేయటం పెద్ద వివాదంగా మారింది.
ఈ ఉదంతంపై రేగిన కలకలం అంతకంతకూ ముదిరి.. కేసుల వరకూ వెళ్లటంతో శంకర్ రంగంలోకి దిగక తప్పలేదు. షూటింగ్ స్పాట్ కు వచ్చిన ఫోటో జర్నలిస్టుపై చిత్ర సహాయ దర్శకుడు.. మరో ఇరువురు దాడి చేసి గాయపర్చారు. ఈ ఉదంతంపై ఫోటో జర్నలిస్టులతో పాటు.. తమిళ మీడియా మిత్రులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితుడు పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేయటంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో శంకర్ ఈ ఉదంతంపై ఫోకస్ చేశారు. ఇష్యూను క్లోజ్ చేయాలన్నట్లుగా రంగంలోకి దిగిన ఆయన.. దాడి ఘటన జరగకుండా ఉండాల్సిందన్నారు. జరిగిన ఉదంతంపై విచారం వ్యక్తం చేసిన శంకర్.. రానున్న రోజుల్లో ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు