ఆయనో డైరెక్టర్.. ఎంతో తపించి కష్టపడి శ్రమించి దర్శకుడిగా తొలి ప్రయత్నం 'నువ్వు లేక నేను లేను'తో సూపర్ హిట్ కొట్టాడు కాశీ విశ్వనాథ్. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని చేసిన రెండో చిత్రం తొలిచూపులోనే. ఈ మూవీ అంతగా ఆడకపోయినా.. ఆ తర్వాత మాత్రం యాక్టర్ గా మారిపోయి.. అనతి కాలంలోనే సెంచరీ కొట్టేయడం విశేషం.
ఈ తరం హీరోయిన్స్ అందరికీ తండ్రిగా చేసేయడం.. అది కూడా ఓ తెలుగు వ్యక్తి ఈ రికార్డు సాధించడం చిన్న విషయమేమీ కాదు. అసలు టాలీవుడ్ లో ఓ దర్శకుడు కేరక్టర్ నటుడిగా స్థిరపడ్డం అనేదే అరుదైన విషయం. తన జీవితానికి 'ర' అనే అక్షరానికి లింక్ ఉందంటున్నాడు కాశీ విశ్వనాథ్. 'దర్శుకుడిగా నాకు తొలుత అవకాశం ఇచ్చిన వ్యక్తి రామానాయుడు. రవిబాబు నాలో నటుడు ఉన్నాడని గురత్ించి అవకాశం ఇచ్చాడు. ఆ చిత్రానికి నిర్మాత రామోజీ రావు. నా 50వ సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. ఆ మూవీ నిర్మాత దిల్ రాజు లో కూడా ఉంటుంది' అంటున్నాడు కాశీ విశ్వనాథ్. సెంటిమెంట్ అని కాదు కానీ అలా కలిసొచ్చిందంతే అని నవ్వేశాడీయన.
'నటుడు కావడం పూర్వ జన్మ సుకృతం. అందరికీ ఆ అవకాశం రాదు. కంటిన్యూ చేయండి' అని బాలయ్య ఇచ్చిన సలహాను జీవితంలో మర్చిపోనన్న కాశీ విశ్వనాథ్.. అధినాయకుడు చిత్రంలో నెగిటివ్ రోల్ బాలయ్యకు ఎదురుగా నుంచుని పేజీ డైలాగ్ చెప్పాల్సి వచ్చిన సందర్భం మాత్రం ఛాలెంజింగ్ గా అనిపించిందని అన్నాడు. ఇక డైరెక్టర్ గా చేయాలని ఉన్నా.. నటుడిగా హాయిగా ఉన్నపుడు కోరి చిరాకులు తెచ్చుకోవడం ఎందుకు అనుకుంటున్నానని అన్నాడు కాశీ విశ్వనాథ్.