మల్లూ బ్యూటీ కీర్తి సురేష్ ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ అనడంలో సందేహం లేదు. తెలుగులో ఇప్పటివరకూ ఈమె నటించినది రెండే సినిమాలు. ఒకటి రామ్ తో నేను శైలజ అయితే.. రెండోది నానితో నేను లోకల్. ఈ రెండు సినిమాలు ఘనవిజయం సాధించాయి.
వీటితో పాటు ప్రస్తుతం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా.. సావిత్రి బయోపిక్ మహానటి.. ఈమె చేతిలో ఉన్నాయి. పవన్ సినిమాకి ఎంతిస్తున్నారో తెలియదు కానీ.. మహానటి మూవీకి మాత్రం ఈమెకు 3 కోట్ల రూపాయలు ముట్టచెప్పారట. తెలుగు-తమిళ్ రెండు భాషల్లో రిలీజ్ కానున్న సినిమా కావడం.. పిక్చరైజేషన్ కు ఎక్కువ సమయం అవసరం అవడంతోనే ఇంతిచ్చారని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈమె లెక్క కోటిన్నర దరిదాపుల్లో ఉండేదంతే. తమిళ్ లో మంచి హిట్స్ ఉండడంతో 2 కోట్ల వరకూ అందుకునేది కీర్తి.
ఇప్పుడు మాత్రం మహానటిని చూపించి.. తన దగ్గరకు వచ్చిన నిర్మాతలను 3 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. అదేమంటే.. తనకున్న మార్కెట్ ప్రకారం సినిమాను తెలుగుతోపాటు తమిళ్ లో కూడా విడుదల చేసుకోవచ్చని సలహా ఇస్తోందట. దీంతో షాక్ తినడం నిర్మాతల వంతు అవుతోంది.