తెలుగులోకి సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. దీని తర్వాత ఆమె నటించిన నేను లోకల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అజ్ఞాతవాసి లాంటి భారీ సినిమాలో నటించింది కీర్తి. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేసేలాగే ఉంది కీర్తి. ఈ సినిమా ఆడియో వేడుకలో మాట్లాడుతూ.. చాలామంది గుర్తించని ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది కీర్తి. తన తల్లి మేనక మూడు దశాబ్దాల కిందట మెగాస్టార్ చిరంజీవితో నటించిందని.. తాను ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా చేయడం తనకు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోందని కీర్తి చెప్పింది.
చిరంజీవి నటుడిగా తన తొలి రోజుల్లో నెగెటివ్ రోల్ చేసిన పున్నమి నాగు లో కీర్తి తల్లి మేనక ఓ కీలక పాత్ర చేసింది. అందులో చిరు-మేనక కాంబినేషన్లో పున్నమి రాత్రి అంటూ సాగే ఫేమస్ పాట కూడా ఉంటుంది. ఆ మేనక కూతురే కీర్తి అనే విషయం చాలామంది గుర్తించి ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని అజ్ఞాతవాసి సినిమాలో కీర్తి గుర్తు చేసింది. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం తనకు అదృష్టమని.. అజ్ఞాతవాసి సినిమా చేయడానికి ముందు వరకు ఒక హీరోగా ఆయనకు తాను అభిమానినని.. ఈ సినిమా కోసం ఆయనతో పని చేశాక ఒక వ్యక్తిగా కూడా ఆయనకు తాను అభిమానిగా మారిపోయానని కీర్తి చెప్పింది.