శ్రీమంతుడు సినిమా అంతా బాగుంటుంది కానీ.. చివర్లో అంత వయొలెన్స్ పెట్టడం.. ఒక మంచి ఎమోషనల్ సీన్ తర్వాత సినిమాను అలా ముగించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ సినిమా వచ్చిన ఏడాది తర్వాత దర్శకుడు కొరటాల శివ కూడా ఆ క్లైమాక్స్ విషయంలో రిగ్రెట్ అవుతున్నాడు. ఆ సినిమాకు ఎమోషనల్ క్లైమాక్స్ అయితే బాగుండేదని.. అలా ముగించాల్సింది కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కొరటాల.
జనతా గ్యారేజ్ సినిమా విషయంలో కొందరు లోపాలు వెతకడం మీద మాట్లాడుతూ కొరటాల ఇలా స్పందించాడు. ఈ సినిమాలో ప్రకృతి ప్రేమికుడిగా కనిపించే హీరో.. తన మరదలిని పెళ్లి చేసుకోవడం గురించి ఒకరు అభ్యంతరం చెప్పారని.. ఐతే మరీ అంత లోతుగా ఆలోచిస్తే సినిమాలు తీయడం.. సినిమాలు చూడటం కష్టమని కొరటాల అభిప్రాయపడ్డాడు. ఇలాంటి లోపాలు వెతికే వ్యక్తుల్ని తాను పట్టించుకోనని కొరటాల అన్నాడు. హీరో హీరోయిన్లకు ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టాక ఇలాంటి విషయాలు ఆలోచించరని చెప్పాడు.
అలాగే సమంత.. నిత్యా మీనన్ పాత్రల నిడివి తక్కువ ఉండటం మీద కూడా విమర్శలు వచ్చాయని.. ఐతే ఈ కథకు ఎంత అవసరమో అంతే వాళ్ల పాత్రలు పెట్టాయని.. ఎంత నిడివి ఉన్నాయన్నది ముఖ్యం కాదని.. ఎంత ఇంపాక్ట్ అన్నదే ముఖ్యమని కొరటాల అన్నాడు. సినిమాలో ఎన్టీఆర్.. మోహన్ లాల్ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో 7 నిమిషాలు మాత్రమే ఉండే రాజీవ్ కనకాల గురించి కూడా అంతే చర్చించుకుంటున్నారని.. దీన్ని బట్టి స్క్రీన్ టైం అనేది అంత ముఖ్యం కాదని చెప్పొచ్చని కొరటాల చెప్పాడు. ఈ సందర్భంలోనే తాను శ్రీమంతుడు క్లైమాక్స్ విషయంలో తప్పు చేశానని.. దాన్ని లోపంగా చెప్పడాన్ని తాను అంగీకరిస్తానని కొరటాల అన్నాడు.