అందాల రాక్షసి.. ఊహలు గుసగుసలాడే.. లెజెండ్ లాంటి సినిమాలతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నాడు సాయి కొర్రపాటి. ఈ తరం నిర్మాతల్లో దిల్ రాజు తర్వాత అంత క్రెడిబిలిటీ తెచ్చుకున్న నిర్మాత సాయి. ఐతే గత రెండు మూడేళ్లుగా సాయి పరిస్థితి ఏమంత బాగా లేదు. సినిమాల ఎంపికలో ఆయన టేస్టు అయితే కనిపిస్తోంది కానీ.. విజయాలు మాత్రం పలకరించట్లేదు. గత ఏడాది రాజా చెయ్యి వేస్తే.. మనమంత సినిమాలు ఆయన్ని పెద్ద బెబ్బే కొట్టాయి. జ్యో అచ్యుతానంద మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ మరీ పెద్ద లాభాలేమీ తెచ్చిపెట్టలేదు. ఏ ఏడాది వారాహి బేనర్ మీద రిలీజైన పటేల్ సార్ రెండు రెళ్లు ఆరు సినిమాలు దారుణమైన ఫలితాన్నిచ్చాయి.
ఈ నేపథ్యంలో సాయి కొర్రపాటి ఆశలన్నీ యుద్ధం శరణం మీదే ఉన్నాయి. ఆయన బేనర్ నుంచి చాన్నాళ్ల తర్వాత కొంచెం ఎక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ఇది. ప్రేమమ్.. రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ల తర్వాత నాగచైతన్య నటించిన సినిమా కావడం.. ప్రోమోలు కూడా బాగుండటంతో ఈ సినిమాపై బజ్ బాగానే ఉంది. కాకపోతే సినిమా రొటీన్ గానే ఉండేలా కనిపిస్తోంది. మరి ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో.. సాయి కొర్రపాటిని ఏ స్థాయిలో నిలబెడుతుందో చూడాలి. ఈ సినిమా తేడా కొడితే సాయి కోలుకోవడం కష్టమవుతుంది. కొత్త దర్శకుడు కృష్ణ మారిముత్తు రూపొందించిన ఈ చిత్రంలో చైతూ సరసన లావణ్య త్రిపాఠి నటించింది.