రచయితగా కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత స్టార్ కమెడియన్ గా ఎదిగారు ఎల్ బీ శ్రీరామ్. తనదైన పంచ్ మార్క్ డైలాగులతో ఎల్ బీ శ్రీరామ్...ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఎల్ బీ శ్రీరామ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అడిగిన ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు ఆయన తనదైన హాస్యచతురతతో సమాధానమిచ్చారు. పవన్ కల్యాణ్ అంటే తన దృష్టిలో జంఝా మారుతం అని శ్రీరామ్ చెప్పారు. టాలీవుడ్ కు చెందిన పలువురు దర్శకులు నటీనటులపై ఆయన తన అభిప్రాయాలను చెప్పారు. ప్రముఖ దర్శకుడు ఈవీవీని ఎవరెస్ట్ శిఖరంతో పోల్చారు. మెగాస్టార్ చిరంజీవి అంటే ‘ఇంద్ర.. మెగా సింహాసనం’అన్నారు. దర్శకుడు కె. విశ్వనాథ్ అంటే కళాతపస్వి.. దాదా సాహెబ్ యశస్వి..అన్నింటినీ మించి ఆయన ఎప్పటికీ శంకరాభరణం అని కితాబిచ్చారు. విలక్షణ దర్శకుడు క్రిష్ అంటే మట్టికి మనిషికి ఉన్న సంబంధం’ అని బదులిచ్చారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి అంటే ‘తిప్పరా మీసం’ అంటూ జక్కన్న గొప్పతనం గురించి చెప్పారు. ‘పరుచూరి బ్రదర్స్ అంటే సంచలనం అని బ్రహ్మానందం అంటే హాస్య విశ్వరూపం అని అన్నారు. ప్రముఖ మాటల రచయిత నటుడు తనికెళ్ల భరణి - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి గొప్పగా చెప్పారు. తన గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు ఎల్బీ శ్రీరామ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. వాడెవడు.. వాడొక చీమ. అలా వెళుతూనే ఉంటాడు. ఏ పంచదార పలుకునో తన కంటె బరువైన ఓ బియ్యపు గింజనో మోసుకుంటూ వెళుతూ ఉంటాడు.