రెండు మూడు రోజులుగా టాలీవుడ్లో ఒక చర్చ నడుస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తాడని. ఐతే శక్తి.. షాడో.. లాంటి డిజాస్టర్లు తీసిన మెహర్ తో మహేష్ బాబు సినిమా చేయడమా అంటూ అభిమానులు కంగారు పడిపోతున్నారు. ఇంతకీ ఈ ప్రచారం మొదలవడానికి కారణం ఏంటి అంటే.. ఇటీవలే మహేష్ సతీమణి నమ్రత తిరుమలకు వెళ్లి మొక్కు చెల్లించుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో పాటు మెహర్ రమేష్ కనిపించాడు. దీంతో మెహర్ తో మహేష్ సినిమా చేయబోతున్నాడని.. మహేష్ సినిమాల వ్యవహారాలన్నీ చూసే నమ్రతను అతను ఇంప్రెస్ చేశాడని ప్రచారం మొదలైపోయింది.
కానీ అసలు విషయం ఏంటంటే.. మహేష్ చేస్తున్న బ్రాండ్లకు సంబంధించి కమర్షియల్స్ తీసే బాధ్యతలు చూస్తున్నాడు మెహర్. ఈ మధ్యే మహేష్.. రామకృష్ణ హౌసింగ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా ఎంపికవగా.. దానికి సంబంధించి ఓ లావిష్ యాడ్ చేశాడు మెహర్. అంతే తప్ప మహేష్ బాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో మెహర్ తో సినిమా చేయడం అసాధ్యమే. అయినా మెహర్ తో సినిమా చేయడానికి మీడియం రేంజి హీరోలు కూడా సిద్ధంగా లేరు. షాడో ముందు వరకు రవితేజ అతడితో సినిమా చేయడానికి సిద్ధపడ్డాడు కానీ.. షాడో రిజల్ట్ చూశాక వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత మెహర్ చాలామంది హీరోల్ని ట్రై చేసినా ఫలితం లేకపోయింది.