ఓవైపు టాలీవుడ్లో కొన్ని రోజులుగా శమంతకమణి పేరు అందరి నోళ్లలోనూ నానుతూ ఉంది. అదే సమయంలో మరకతమణి అంటూ వస్తున్నాడు తెలుగువాడైన తమిళ హీరో ఆది పినిశెట్టి. అతను హీరోగా తమిళంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ మరకతమణి అదే పేరుతో తెలుగులోకి అనువాదం అయింది. శనివారం ఆడియో వేడుక నిర్వహించి.. థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ నెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకీ ఈ మరకతమణి ట్రైలర్ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం పదండి.
క్రీస్తు శకం 11వ శతాబ్దంలో విక్రమాదిత్య అనే సామంత రాజు.. అత్యంత విలువైన.. శక్తిమంతమైన మరకతమణి తన తర్వాత ఎవరి సొంతం కాకూడదన్న ఉద్దేశంతో తన మరణానంతరం తనతో పాటే దాన్ని సమాధి చేయాలని ఆదేశిస్తాడు. ఆయన మాట ప్రకారమే దాన్ని సమాధి చేస్తారు. ఐతే ఈ మరకత మణి విలువ తెలుసుకుని దాన్ని ఇప్పటి తరం వాళ్లు సొంతం చేసుకునే ప్రయత్నంలో పడతారు. అది చాలా ప్రమాదకరం అని తెలిసి కూడా హీరో ఒక పెద్ద విలన్ దగ్గర డీల్ మాట్లాడుకుని.. దాన్ని తేవడానికి బయల్దేరతాడు. ఐతే మరకతమణి జోలికి వెళ్లడంతో అనూహ్యమైన పరిణామాలు జరుగుతాయి. దాని వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతారు. హీరో కూడా అనవసరంగా చిక్కుల్లో పడతాడు. మరి ఈ చిక్కుల నుంచి హీరో ఎలా బయటపడ్డాడు.. మరకతమణి చివరికి ఏమైంది అన్నది ఈ చిత్ర కథ. ట్రైలర్ చూస్తే సినిమా ఉత్కంఠభరితంగా.. ఆసక్తికరంగా సాగేలా కనిపిస్తోంది.