ఈనెల 22తో నటుడిగా నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకుంటున్నారు కలెక్షన్ కింగ్ మోహన్బాబు . నాలుగు దశాబ్దాల నట జీవితంలో మోహన్ బాబు ఎన్నో రకాల పాత్రలు చేశారు. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన భక్తవత్సలం నాయుడు సినిమాలపై ఆసక్తితో చెన్నై నగరాన్ని చేరుకున్నారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో1975 - నవంబర్ 22న విడుదలైన స్వర్గం-నరకం సినిమాతో నటుడుగా తెలుగు తెరకు మోహన్ బాబుగా పరిచయం అయ్యారు. తనదైన విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుని వెండితెర పేరునే అసలు పేరుగా మార్చుకునేంత స్థాయిని చేరుకున్నారు. నాయకుడిగా - ప్రతినాయకుడిగా - క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు వన్నె తెచ్చిన నటుడు. ముఖ్యంగా డైలాగ్స్ ను సన్నివేశానికి తగిన విధంగా నొక్కి వక్కాణించడంలో ఆయనకు ఆయనే సాటి.
ఏకంగా 520 చిత్రాలకు పైగా నటించి మెప్పించారు. ప్రతినాయకుడిగా విలక్షణ విలనిజాన్ని పండించిన మోహన్ బాబు అల్లుడుగారు - అసెంబ్లీరౌడీ - రౌడీ గారి పెళ్ళాం - పెదరాయుడు - మేజర్ చంద్రకాంత్..ఇలా 181 చిత్రాల్లో నాయకుడిగా నవరసాలు పండించారు. అలాగే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ను స్టార్ట్ చేసి 50కి పైగా విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ను స్థాపించి విద్యను అందిస్తున్నారు. తన విలక్షణ నటనతో 520కు పైగా చిత్రాల్లో నటించి తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నవంబర్ 22 2015కు నటుడుగా 40 వసంతాలను పూర్తి చేసుకుంటున్నారు. సందర్భాన్ని పురస్కరించుకుని అదే రోజున వేడుకలను నిర్వహించనున్నారట.