మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. కానీ ఆయన సోదరుడు నాగబాబు మాత్రం రాజకీయాల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ కే మద్దతు ఇవ్వాలనుకుంటున్నాడు. జనసేన పెట్టినపుడు మెగా అభిమానులంతా చిరంజీవి వెనుకే ఉండాలని పిలుపు ఇచ్చిన నాగబాబు.. ఇప్పుడు తనే స్వయంగా జనసేన కోసం పని చేస్తానంటున్నాడు. తన తమ్ముడు నిస్వార్థపరుడని.. అతడు సమాజం కోసమే జనసేన పెట్టాడని.. తాను కూడా నిస్వార్థంగా జనసేన పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్నానని నాగబాబు వ్యాఖ్యానించాడు. 2019లో తన ఓటు పవన్ కళ్యాణ్ కే అని కూడా మెగా మిడిల్ బ్రదర్ స్పష్టం చేశాడు.
నాగబాబు ప్రకారం పవన్ కళ్యాన్ లో ఉన్న ఐదు గొప్ప లక్షణాలు..
1. మంచి మనసున్న మనిషి
2. సమాజానికే తొలి ప్రాధాన్యం. కుటుంబం కూడా తర్వాతే.
3. సాయపడే గుణం ఎక్కువ. కానీ దాని గురించి పబ్లిసిటీ చేసుకోడు. నేను ఇబ్బందుల్లో ఉండగా సాయం చేసిన సంగతి కూడా అతను చెప్పుకోలేదు. నేనే దాని గురించి వెల్లడించాను.
4. అపారమైన విజ్నానం ఉంది.
5. విశాల దృక్పథం ఉన్నవాడు. సమాజానికి ఎప్పుడూ ఏదో చేయాలనుకుంటాడు. అందుకే జనసేన పార్టీ పెట్టాడు
ఇంకా పవన్ గురించి రాజకీయ కోణంలో నాగబాబు విశ్లేషిస్తూ.. ??పవన్ ఏదో ముఖ్యమంత్రి అయిపోదామని జనసేన పార్టీ పెట్టలేదు. నిబద్ధతతో ప్రజలకు సేవ చేయడానికే పార్టీ పెట్టాడు. కళ్యాణ్ సీఎం అయినా.. ప్రతిపక్షంలో ఉన్నా సామాన్యుడితోనే ఉంటాడు. ప్రస్తుతం నేనొక సామాన్యుడిలా మాట్లాడుతున్నా. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి? మంచి మనస్తత్వం.. సాయపడే గుణం.. నిస్వార్థం.. రాజకీయ అవగాహన.. ఇవన్నీ ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణే. 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ.. తెలుగుదేశం-బీజేపీలతో పొత్తు పెట్టుకుంటుందో లేదో కానీ.. ఒక ఓటరుగా నా ఫస్ట్ ఛాయిస్ అయితే కళ్యాణే. రాజకీయాల్లో అతను అత్యుత్తమ వ్యక్తి. నాకు కళ్యాణ్ వ్యక్తిత్వం.. అతడి ఆశయాలంటే ఇష్టం. అతనేం చేసినా ప్రజల శ్రేయస్సు కోసమే చేస్తాడు. జనసేనకు మద్దతుగా నిలవడానికి నా ఓటును ఆంధ్రప్రదేశ్ కు మార్చుకోవాలని కూడా అనుకుంటున్నా. వ్యక్తిగత లక్ష్యాలేమీ లేకుండా జనసేన పార్టీ కోసం నేను పని చేయాలనుకుంటున్నా?? అన్నాడు.
అధికార తెలుగుదేశం.. భారతీయ జనతా పార్టీలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడిపోయాయని.. ఓటు బ్యాంకు రాజకీయాలతో అధికారంలోకి వచ్చాక అంతకుముందు ముందు ఇచ్చిన హామీల్ని ఈ పార్టీలు తుంగలో తొక్కాయని నాగబాబు విమర్శించాడు