మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు అక్కినేని నాగార్జున టాటా చెప్పేశాడుగా.. మళ్లీ ఆ షోలో ఆయన కనిపించడమేంటి.. అంటారా? ఇక్కడే ఉంది మతలబు. ఆయన ఈసారి హోస్టుగా కాదు.. గెస్టుగా రాబోతున్నాడు. చిరంజీవి క్విజ్ మాస్టర్ హోదాలో కూర్చుంటే.. నాగ్ ఇవతల సెలబ్రెటీ పార్టిసిపెంట్ కాబోతున్నాడు. ఓం నమో వేంకటేశాయ సక్సెస్ మీట్లో భాగంగా నాగ్ ఈ విషయం వెల్లడించాడు.
ఓం నమో వెంకటేశాయ చిత్రీకరణ సందర్భంగా తనకు కలిగిన అనుభవాలన్నింటినీ మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో భాగంగా చిరుతో.. ప్రేక్షకులతో పంచుకోబోతున్నట్లు నాగ్ వెల్లడించాడు. ఈ సినిమా విడుదలకు ముందు చిరుకు స్పెషల్ షో వేశామని.. అది చూస్తూ ఆయన కన్నీళ్లు పెట్టేసుకున్నారని నాగ్ తెలిపాడు. నన్ను కూడా ఏడిపించేశావ్ కదా నాగ్.. అంటూ చిరు తన జేబులో తడిగా ఉన్న టిష్యూలను తనకు చూపించినట్లు నాగ్ తెలిపాడు.
అన్నమయ్య సినిమాతో తన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైందని.. అప్పట్నుంచి మానసికంగానూ తనలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని.. ఓం నమో వేంకటేశాయ సమయానికి తాను వ్యక్తిగా చాలా చాలా మారానని నాగ్ చెప్పాడు. ఇదంతా రాఘవేంద్రరావు గారి వల్లే సాధ్యమైందని.. ఆయన.. జె.కె.భారవి కలిసి మూడు నాలుగేళ్లు ఎంతో కష్టపడి.. తపించి ఓం నమో వేంకటేశాయ ను ఇంత బాగా తీర్చిదిద్దారని నాగ్ తెలిపాడు