ఒకవైపున రుద్రమదేవి .. మరో వైపున బాహుబలి సినిమా షూటింగులు పూర్తికావడంతో, తరువాత ప్రాజెక్టుపై అనుష్క దృష్టిపెట్టింది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన 'సైజ్ జీరో' అనే సినిమాలో నటిస్తూ అనుష్క బిజీ బిజీగా వుంది. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో గెస్టుగా నాగార్జున కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున గెస్టుగా చేస్తాడా? అనే ఆశ్చర్యం సహజంగానే చాలామందికి కలుగుతుంది. అయితే అది సినిమాని మరింత ఆసక్తికరంగా ముందుకు నడిపించే పాత్ర అని తెలుస్తోంది.
అనుష్కతో పాటు ఆర్య నటిస్తోన్న ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ఒక కీలకమైన పాత్ర ఉందట. తెరపై కాసేపు మాత్రమే కనిపించే ఈ పాత్రను, మంచి క్రేజ్ .. ఇమేజ్ వున్న కథానాయకులతో చేయిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించారు. దాంతో తనకి తెలిసి ఈ పాత్రకి నాగార్జున బాగా నప్పుతాడని అనుష్క అభిప్రాయపడింది. అంతేకాదు, నాగ్ తో మాట్లాడి ఈ పాత్ర చేయడానికి ఒప్పించిందని అంటున్నారు. ఏదేవైనా నాగార్జున గెస్టురోల్ .. ఈ సినిమాపై అంచనాలు పెంచుతుందని చెప్పుకోవచ్చు.