ఒక హీరో.. ఒక హీరోయిన్ కలిసి ఒకటికి రెండు హిట్లు ఇచ్చారంటే వారికి హిట్ పెయిర్ అన్న ట్యాగ్ వచ్చేస్తుంది. వాళ్లతో మళ్లీ సినిమాలు చేయడానికి ఫిలిం మేకర్స్ ఆసక్తి చూపిస్తారు. ప్రేక్షకులు కూడా ఆ హీరో హీరోయిన్ మళ్లీ జోడీ కడుతున్నారంటే అంచనాలు పెంచుకుంటారు. బాలకృష్ణకు ఈ తరం కథానాయికల్లో అలా బాగా జోడీ కుదిరింది నయనతారతోనే. ఆమె కాంబినేషన్లో బాలయ్యకు సింహా లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించిన శ్రీరామరాజ్యం క్లాసిక్ లాగా నిలిచిపోయింది. ఈ జోడీకి ఇప్పుడు జై సింహా హ్యాట్రిక్ సినిమా అవుతుందని ఆశిస్తున్నారు.
జై సింహా మొదలైన తొలి నాళ్లలోనే ఈ సినిమాలో నయనతార తన లుక్ ను జనాలకు పరిచయం చేసింది. ఐతే ఆమె బాలయ్యతో కలిసి నటిస్తున్న పిక్స్ ఏవీ బయటికి రాలేదు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి బైక్ మీద విహరిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది అందరినీ ఆకర్షిస్తోంది. మరోవైపు జై సింహా లో రెండో హీరోయిన్ హరిప్రియతో కలిసి బాలయ్య ఉన్న ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఈ ఇద్దరు హీరోయిన్లూ ట్రెడిషనల్ లుక్స్ లోనే కనిపిస్తున్నారు. హరిప్రియ అయితే పూర్తి సంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో నటాషా దోషి అనే మలయాళ హీరోయిన్ కూడా నటిస్తోంది. ఆమె లుక్ ఏదీ బయటికి రాలేదు.