దర్శకత్వం వైపు మళ్లిన కె.ఎస్.రవీంద్రది దర్శకుడిగా రెండు సినిమాల అనుభవం. తొలి సినిమా పవర్ పర్వాలేదనిపిస్తే.. రెండో సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ అయింది. నిజానికి సర్దార్ స్క్రిప్టులో బాబీ పాత్ర ఏమీ లేకపోయినప్పటికీ.. ఆ సినిమా తాలూకు నెగెటివ్ ఎఫెక్ట్ అతడి మీద పడింది. అందుకే ఎన్టీఆర్ అతడికి అవకాశమిస్తుంటే చాలామంది సందేహించారు. అయినా ఎన్టీఆర్ అతడిని నమ్మి జై లవకుశ చేశాడు. బాబీకి ఛాన్సివ్వడం మీద చాలామంది అభ్యంతరాలు చెప్పినట్లు జై లవకుశ ఆడియో వేడుకలో కళ్యాణ్ రామ్ ఓపెన్ గా చెప్పేశాడు. అయినా ఎందుకు తాము అతడికి అవకాశమిచ్చామో చెప్పాడు.
ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ విషయమై వివరణ ఇచ్చాడు. తాను దర్శకుడి జయాపజయాల్ని బట్టి కాకుండా అతను చెప్పే కథను బట్టి సినిమా చేస్తానని.. బాబీని కూడా అలాగే నమ్మానని ఎన్టీఆర్ తెలిపాడు. బాబీ రాసిన కథతో పాటు అతను ఆ కథను నరేట్ చేసిన విధానం కూడా తనకు నచ్చిందని అతనన్నాడు. ఈ కథను జెన్యూన్ ఎఫర్ట్ పెట్టి చేస్తే మంచి ఫలితం ఉంటుందని తాను నమ్మానన్నాడు. కథ చెప్పినట్లే సినిమా తీస్తాడా అనే విషయంలో ముందు అతడికి తమ వంతుగా ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలో అదంతా చేసినట్లు చెప్పాడు. తాము ఆశించినట్లే బాబీ సినిమా బాగా తీశాడన్నాడు.