టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి రెండు వరుస విజయాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొత్త సినిమా కోసం దర్శకుడు కొరటాల శివతో జతకట్టిన విషయం తెలిసిందే. శ్రీమంతుడు తర్వాత టాలీవుడ్లో టాప్ దర్శకుల్లో ఒకరుగా మారిన కొరటాల శివ, జనతా గ్యారెజ్ పేరుతో ఎన్టీఆర్తో ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ హైద్రాబాద్లో జరుగుతోంది. ఎన్టీఆర్తో సహా ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు.
ఇక గత కొద్దిరోజులుగా షెడ్యూల్ జరుగుతోన్న ప్రాంతంలో ఎండలు మండిపోతున్నా టీమ్ ఆ ఎండల్ని సైతం లెక్కచేయకుండా షూటింగ్ చేస్తూ పోతోంది. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలియజేస్తూ.. ఈ స్థాయి ఎండల్లో కూడా తమ టీమ్ కష్టపడుతూ సినిమా కోసం పనిచేస్తోందని, టీమ్కు ఈ సందర్భంగా హ్యాట్సఫ్ చెబుతున్నానని అన్నారు. ప్రస్తుతం భారీ ఎత్తున ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటిస్తోండడం విశేషంగా చెప్పుకోవచ్చు.