బాలీవుడ్ దర్శక నిర్మాతలు ... కథానాయకులు టాలీవుడ్ .. కోలీవుడ్ సినిమాలను ఎంతో ఆసక్తికరంగా గమనిస్తూ వుంటారు. ఇక్కడ ఘనవిజయాలను అందుకున్న సినిమాల రీమేక్ రైట్స్ కోసం పోటీపడుతుంటారు. ఇప్పుడా పోటీ 'ఓకే బంగారం' విషయంలో జరుగుతున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. మణిరత్నం టేకింగ్ ని అభిమానించేవాళ్లు ... ఆరాధించేవాళ్లు బాలీవుడ్ లో భారీసంఖ్యలోనే వున్నారు. అక్కడ ఆయన సినిమాలకి మంచి మార్కెట్ కూడా వుంది. అందువల్లనే మణిరత్నం తన సినిమాను తమిళ .. తెలుగు .. హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కిస్తూ వుంటాడు.
అయితే ఈసారి 'ఒకే బంగారం' సినిమాను ఆయన తెలుగు .. తమిళ భాషల్లో మాత్రమే విడుదల చేశాడు. కథని కావ్యంగా మలచగలిగే సామర్థ్యం కలిగిన దర్శకుడిగా మణిరత్నాన్ని ఈ సినిమా మరోసారి నిలబెట్టింది. ఆయన తీసుకున్న కథానేపథ్యం బాలీవుడ్ ట్రెండ్ కి మరింత దగ్గరగా ఉండటంతో, అక్కడి ప్రముఖ సంస్థలు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయట. దాంతో ఈ సినిమా బాలీవుడ్ తెరకి వెళ్లే తీరుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.