రచయిత సాయిమాధవ్ బుర్రా పేరు మార్మోగిపోతోంది. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆయన పేరే జపిస్తోంది. సంక్రాంతి సినిమాలు గౌతమీపుత్ర శాతకర్ణి - ఖైదీ నంబర్ 150 కోసం రాసిన మాటలే అందుకు కారణం. ఆ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరూ సాయిమాధవ్ అదిరిపోయే సంభాషణలిచ్చాడని మెచ్చుకొంటున్నారు. ఆ మెచ్చుకోళ్లు చాలవూ... ఆఫర్లు వరస కట్టడానికి! ఈ రెండు సినిమాలకంటే ముందే సాయిమాధవ్ తనేంటో నిరూపించుకొన్నాడు. కానీ ఒకేసారి కీలకమైన ఈ రెండు చిత్రాలూ ఘన విజయం సాధించడంతో సాయిమాధవ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన చేతికి మరో కీలకమైన ఆఫర్ అందినట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్ పట్టుబట్టి మరీ ఆయనతో తన కాటమరాయుడు సినిమాకి మాటలు రాయించుకొంటున్నాడట. ఇప్పటికే ఆ సినిమా చాలావరకు షూటింగ్ అయింది. అయితే సంభాషణల విషయంలో మాత్రం ఆయన ఇంకా ఫుల్లుగా సంతృప్తికరంగా లేడట. కొన్ని ఎమోషనల్ సీన్లలో సాయిమాధవ్ లాంటి రచయిత సంభాషణలు రాస్తేనే బాగుంటుందనేది పవన్ అభిప్రాయమట. అందుకే ఆయనకి కబురు పెట్టి మిగిలిన సన్నివేశాల కోసం సంభాషణలు రాయించుకొంటున్నాడట. పవన్ చిత్రాలకి సాయిమాధవ్ మాటలు రాయడం కొత్తేం కాదు. ఇదివరకు గోపాల గోపాలతో పాటు - సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి కూడా ఆయనే మాటలు అందించాడు. ఆ మాటలు పవన్ కళ్యాణ్ కి చాలా బాగా నచ్చాయట. అప్పట్నుంచే మళ్లీ ఆయనతో పనిచేయాలని పవన్ నిర్ణయించుకొన్నాడట. ఆ మేరకు ఇటీవల కబురు పెట్టి కాటమరాయుడు ఆఫర్ కట్టబెట్టినట్టు తెలుస్తోంది. అంటే కాటమరాయుడులో పవన్ మాటలు అదిరిపోనున్నాయన్నమాట.