మాస్ ప్రేక్షకుల్లో కనీవినీ ఎరుగనంత క్రేజ్ని సంపాదించుకొన్న కథానాయకుడు పవన్ కల్యాణ్. తెలుగులో అత్యధిక పారితోషికం అందుకొనేది ఆయనే. ఒక సినిమా ఒప్పుకొంటే చాలు కోట్లు రాలతాయి. అలాంటి నటుడు గడిపే ప్రతి రోజుకీ ఓ లెక్కుంటుంది. కానీ పవన్కల్యాణ్ మాత్రం అలాంటి లెక్కలకి ఆమడ దూరంగా ఉంటారు. మార్కెట్టు, పారితోషికం... ఇవన్నీ పవన్కల్యాణ్ దృష్టిలో రెండో ప్రాథమ్యాలే. సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడే పవన్ కల్యాణ్ సమాజం గురించి ఆలోచించడానికే ప్రాధాన్యమిస్తుంటాడు.
ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (ఉక్తా) వార్షికోత్సవ వేడుకల్లో పవన్కల్యాణ్ లండన్ వెళ్లారు. అక్కడ మన భాష, కళల గురించి ఆయన చెప్పిన మాటలు ప్రవాసుల్ని కదిలించాయి. కళలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయని, తన సినిమాల్లో జానపద గీతాల్ని వినిపించడానికి మన సంస్కృతిని చాటి చెప్పడంలో భాగమే అని పవన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. లండన్లో ఆయన ఉక్తా వేడుకల్లో పాల్గొని ప్రసంగించడంతో పాటు, అభిమానులతోనూ సరదాగా ముచ్చటించారు. ఆ మాటల్లో అడుగడుగునా పవన్ సాధారణతత్వం బయటపడింది. ??మాది ఓ మధ్య తరగతి కుటుంబం. మేం ఉండే ప్రాంతంలో అవకాశాలకి చాలా కొరత ఉండేది. ఓ సినిమా చూడ్డం అంటే ఓ పండగలా అనిపించేది. అయితే నేనెప్పుడూ యాక్టర్ కావాలనుకోలేదు. కానీ అన్నయ్య అలా కాదు, నటుడు కావాలనే లక్ష్యంతో పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నో అవరోధాలు, మరెన్నో అవమానాల్ని భరించి ఈ స్థాయికి చేరుకొన్నారు. ప్రతి చోటా కిందకు లాగేసేవాళ్లు చాలామంది ఉంటారు. అన్నయ్య మాకు వారసత్వంగా అందించిన విషయం ఏంటంటే షార్ట్కట్స్ని నమ్ముకోకుండా కష్టపడ్డాన్ని నమ్ముకోండి అని చెప్పాడు. అదే చేస్తున్నాం?? అని ఈ సందర్భంగా పవన్ అభిమానులతో వ్యాఖ్యానించారు. మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి తాను సిద్ధమే అని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. తమిళ నటుడు అజిత్తో కలిసి నటించొచ్చు కదా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు పవన్ స్పందిస్తూ... ??అజిత్తో కలిసి నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇప్పటిదాకా ఆ తరహా ఆలోచనతో ఎవ్వరూ రాలేదు. ఒకవేళ వస్తే నటించడానికి నేను సిద్ధమే??. అని చెప్పారు.
తపన పడేవారి కోసం..
పవన్కల్యాణ్కి పుస్తక పఠనం అంటే ఎంతో ఆసక్తి. ఆయన ఇటీవల గుంటూరు శేషేంద్రశర్మ రాసిన ?ఆధునిక మహాభారతం? చదివారు. ఆ గ్రంథాన్ని పవన్కి ఆయన మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ పరిచయం చేశారు. ఆధునిక మహాభారతం చదివాక పవన్కి అది ఎంతో విలువైనదిగా, ప్రీతిపాత్రమైనదిగా మారింది. అదే సమయంలో ఆ గ్రంథాన్ని పునర్ముద్రించడానికి గుంటూరు శేషేంద్రశర్మ తనయుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడన్న విషయం తెలుసుకొని పవన్ వెంటనే స్పందించారు. ఆ గ్రంథం పునర్ముద్రణకి కావల్సిన నిధుల్ని సమకూర్చారు. ??నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆధునిక మహాభారతం అనే ఈ మహాగ్రంథాన్ని, దేశ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారికి అందుబాటులో ఉండాలన్న నా ఆకాంక్ష... ఈ మహాగ్రంథాన్ని యింకోసారి ఇలా మీ ముందుకు తీసుకొచ్చింది?? అని ఆ గ్రంథంలో తన మాటగా రాశారు పవన్ కల్యాణ్. పవన్కల్యాణ్ని కేవలం ఓ కథానాయకుడిగానే చూడలేం. ఆయనలో మంచి సాహిత్యాభిలాషి ఉన్నారు. భాష, కళలు, సంప్రదాయాలంటే ఎంతో మక్కువ ప్రదర్శిస్తుంటారు. ఆ అభిరుచే ఆయన ఇటీవల లండన్కి వెళ్లడానికి కారణమైంది. ఆ అభిరుచే గుంటూరు శేషేంద్రశర్మ రాసిన ?ఆధునిక మహాభారతం? గ్రంథాన్ని పునర్ముద్రణకి నడుం బిగించేందుకు దోహదపడింది.
గెటప్ సిద్ధమైంది
పవన్ కొత్త సినిమాకి సర్వం సిద్ధమైంది. డాలీ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రం కోసం పవన్ కూడా గెటప్ని సిద్ధం చేశాడు. రాయలసీమ నేపథ్యంలో సాగనున్న ఆచిత్రంలో పవన్ ఓ ఫ్యాక్షనిస్టు ప్రేమికుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం మీసం మెలేసి కొత్త తరహాలో కనిపిస్తున్నారు.