ఆసక్తికర సన్నివేశం ఒకటి జరిగింది. అనుకోకుండా జరిగిందో.. మరింకేదైనా కారణమో కానీ.. కళాతపస్వి కె. విశ్వనాథ్ కు దాదా పాల్కె అవార్డు ప్రకటించిన తర్వాత ఆయన్ను కెమేరా ముఖంగా అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. ఇంత పెద్ద చలనచిత్ర పరిశ్రమ ఉండి.. ఇంత మంది ప్రముఖులు ఉన్నా.. కె.విశ్వనాథ్ ను అభినందించేందుకు మాత్రం పెద్దగా వెళ్లినట్లుగా కనిపించదు. ఒకవేళ వెళ్లినా మీడియాకు కబురు పంపించలేదేమో కానీ.. ఆయన్ను అభినందించిన దృశ్యాలు బయటకు రాలేదు. దీనికి భిన్నంగా మెగాస్టార్ మాత్రం మీడియా తోడుగా వెళ్లి మరీ కళాతపస్విని అభినందించటమే కాదు.. ఆయన ముందు చిన్నపాటి ప్రసంగం చేసి వచ్చారు.
ఇదిలా ఉంటే.. నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విశ్వనాథ్ ఇంటికి వెళ్లి అభినందించి రావటం విశేషంగా మారింది. నిన్న అన్న.. నేడు తమ్ముడు వెళ్లి వేర్వేరుగా అభినందనలు పలకటం ఒక ఎత్తు అయితే.. మెగాస్టార్ వెంట కానీ పవర్ స్టార్ వెంట కానీ మెగా హీరోలు ఎవరూ కనిపించకపోవటం ఒక విశేషంగా చెప్పాలి. పవన్ తో పాటు మాత్రం ప్రస్తుతం సినిమా చేస్తున్న ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇరువురు కలిసి విశ్వనాథ్ ను శాలువాతో సత్కరించటం కనిపిస్తుంది.