పూజా హెగ్డే తెలుగులో చేసిన రెండు సినిమాలూ (ముకుంద.. ఒక లైలా కోసం) ఆడలేదు. ఆ సినిమాల వల్ల పూజాకు పెద్దగా పేరు కూడా రాలేదు. గ్లామర్ హీరోయిన్లనే గుర్తించే టాలీవుడ్ కు ఆ రెండు సినిమాల్లో పద్ధతిగా కనిపించిన పూజా ఆనలేదు. పైగా ఆ సినిమాల తర్వాత దాదాపు రెండేళ్ల పాటు టాలీవుడ్లో కనిపించలేదు. హిందీలో ఎంతో కష్టపడి.. ఇష్టపడి చేసిన ‘మొహెంజదారో’ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో పూజా కెరీరే ప్రమాదంలో పడే పరిస్థితి కనిపించింది. అలాంటి స్థితిలో ఆమెకు పిలిచి.. దువ్వాడ జగన్నాథం లాంటి పెద్ద సినిమాలో ఛాన్సిచ్చారు బన్నీ అండ్ టీం. డీజే ఫలితం సంగతలా పక్కన పెడితే.. ఈ సినిమాతో పూజాకు చాలానే పేరొచ్చింది. తన గ్లామర్ తో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందామె.
దీంతో పూజాకు టాలీవుడ్లో అదిరిపోయే ఛాన్సులొస్తున్నాయి. ఆమెకు కోటిన్నర పారితోషకం ఇచ్చి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు బుక్ చేసుకున్నారు. త్వరలోనే ఆమె మహేష్ బాబు సరసన నటించొచ్చన్న ప్రచారం కూడా నడుస్తోంది. అందుకే డీజే తో తన కెరీర్ ను మలుపు తిప్పిన బన్నీ మీద ప్రశంసలు కురిపిస్తూ.. అతడి కోసం ఎలాంటి పాత్రయినా చేయడానికి తాను సిద్ధమని ప్రకటించింది పూజా. తాజాగా ఒక షో రూం ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న పూజా.. బన్నీని ఆకాశానికెత్తేసింది. బన్నీ పిలిచిన ఏదైనా సినిమాలో చేయమంటే.. రెండో ఆలోచనే లేకుండా ఒప్పేసుకుంటానని తెలిపింది. ఆ సినిమా కథేంటి.. తన పాత్ర ఏంటి అని కూడా అడక్కుండా వెంటనే ఒప్పేసుకుంటానని పూజా చెప్పింది.