రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరంటారు. ఇది సినిమా రంగానికి కూడా వర్తిస్తుంది. నిన్నటి విరోధులు నేడు స్నేహితులైపోతారు... నేటి స్నేహితులు రేపు విరోధులైపోతారు. అలాగే, మొన్నా మధ్య ప్రకాష్ రాజ్ -కృష్ణవంశీ తమ మనస్పర్ధలను పక్కన పెట్టి, స్నేహితులుగా మారారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్, శ్రీను వైట్ల కూడా త్వరలో మళ్లీ కలవనున్నట్టు తెలుస్తోంది. విశేషం ఏమిటంటే, అప్పుడు రామ్ చరణ్ సినిమా కారణంగానే వారు కలవగా ... ఇప్పుడు కూడా మళ్లీ రామ్ చరణ్ సినిమాలోనే వీరిద్దరూ పనిచేయనున్నట్టు సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వంలో తాను నటించే సినిమాలో ప్రకాష్ రాజ్ కచ్చితంగా ఉండాల్సిందేనని చరణ్ తేల్చిచెప్పాడట. దాంతో శ్రీను వైట్ల ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రాజీ పడుతున్నట్టు చెబుతున్నారు. శ్రీనుతో కలసి పనిచేయడానికి తనకేమీ అభ్యంతరం లేదని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ చెప్పడం విశేషం!