తెలంగాణ ప్రాంతంలోని కొండారెడ్డి పల్లె అనే గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ప్రకాష్ రాజ్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. నిన్న తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును కలిసి ఆ గ్రామం గురించి.. తాను చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించాడు ప్రకాష్ రాజ్. ఐతే కేటీఆర్ తో ఇలా మాట్లాడాడో లేదో.. 24 గంటలు తిరక్కుండానే ఆ గ్రామంలో వాలిపోయాడు ప్రకాష్ రాజ్. దత్తత గురించి వెల్లడించిన కొన్ని గంటల్లోనే చేతల మనిషిగా మారిపోయాడు.
మంగళవారం తన టీంతో కలిసి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లెకు చేరుకున్నాడు ప్రకాష్ రాజ్. ఈ గ్రామంలో దాదాపుగా అందరూ పేదలే. వెనుకబడిన వర్గాలే. ఆర్థికంగా సామాజికంగా బాగా వెనుకబడిన ఈ గ్రామాన్ని పరిశీలించారు ప్రకాష్ రాజ్. అక్కడి జనాలతో పిల్లలతో కలిసిపోయి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాలతో పాటు గ్రామంలోని ప్రభుత్వ భవనాల్ని రోడ్లను పరిశీలించారు ప్రకాష్ కాజ్. తన టీంతో కలిసి అన్ని విషయాల్ని నోట్ చేసుకున్నారాయన.
అనంతరం గ్రామస్థులతో కలిసి నేల మీద కూర్చుని రచ్చబండ లాంటి కార్యక్రమం నిర్వహించారు. ఓ పిల్లాణ్ని ఒడిలో పెట్టుకుని గ్రామస్థులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని అందరం కలిసి బాగుచేసుకుందామని.. ఆర్థికంగా తాను చేయాల్సిన సాయమంతా చేస్తానని.. గ్రామస్థులు కూడా కలిసి వస్తే.. కొండారెడ్డి పల్లెను రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవచ్చిని ఆయన పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్ లాంటి ప్రముఖ నటుడు తమ గ్రామానికి రావడమే కాక.. తమ కష్టాలు తీర్చడానికి నడుం బిగించడంతో ఆ గ్రామస్థుల ఆనందానికి అవధుల్లేవు.