గత ఏడాది ?ఎవడే సుబ్రమణ్యం?తో సక్సెస్ ట్రాక్ ఎక్కినప్పటి నుంచి దూసుకెళ్లిపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ?భలే భలే మగాడివోయ్? నాని కెరీర్ ను సరికొత్త మలుపు తిప్పింది. ఇక నాని లేటెస్ట్ మూవీ ?కృష్ణగాడి వీర ప్రేమ గాథ? కూడా మంచి ఫలితాన్నే అందుకుంది. హ్యాట్రిక్ హిట్లు కొట్టిన నాని.. తన తర్వాతి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తన శైలికి నప్పే వైవిధ్యమైన సినిమాలే ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే తన ఆది గురువు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ?జెంటిల్మన్? అనే రొమాంటిక్ థ్రిల్లర్లో నటిస్తున్న నాని.. ?ఉయ్యాల జంపాల? లాంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటయ్యాడు.
తాజాగా నాని మరో సినిమాకు పచ్చజెండా ఊపాడు. ?మేం వయసుకు వచ్చాం? సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. గత ఏడాది ?సినిమా చూపిస్త మావ?తో తొలి సక్సెస్ రుచి చూసిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతుండటం విశేషం. ?సినిమా చూపిస్త మావ? నిర్మాత బెక్కెం వేణుగోపాల్ కూడా ఈ సినిమాకు భాగస్వామిగా ఉండబోతున్నాడు. ?సినిమా చూపిస్త మావ? ప్రివ్యూ షో చూసి తెగ నచ్చేసి దిల్ రాజే స్వయంగా రిలీజ్ చేశాడు. అప్పుడే త్రినాథ రావు టాలెంటుని పసిగట్టిన రాజు.. తన బేనర్లో సినిమా చేయడానికి కమిట్మెంట్ తీసుకున్నాడు. ఇటీవలే త్రినాథరావు చెప్పిన కథకు నాని కూడా పచ్చజెండా ఊపేయడంతో ఈ ప్రాజెక్టు ఓకే అయింది.