బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఎంతగా జనాల మెదళ్లను తొలిచేస్తోందో.. బాహుబలి: ది కంక్లూజన్ కర్ణాటకలో విడుదలవుతుందా లేదా అనే ప్రశ్న కూడా అదే స్థాయిలో ఉత్కంఠ రేపుతోంది ఇప్పుడు. ఎప్పుడో తొమ్మిదేళ్ల కిందట నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యల్ని కారణంగా చూపిస్తూ.. బాహుబలి-2 ను కన్నడిగులు తమ రాష్ట్రంలో విడుదల కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండటం విస్మయ పరుస్తోంది. దీనిపై స్వయంగా రాజమౌళి స్పందించాడు. కన్నడిగుల్ని ఉద్దేశించి ఒక వీడియో ద్వారా సినిమాను ఆడనివ్వాలని వినమ్రంగా వేడుకున్నాడు.
ఈ వీడియోలో రాజమౌళి వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే.. సత్యరాజ్ నుంచి బాహుబలి బృందానికి పెద్ద షాకే తగిలినట్లుగా కనిపిస్తోంది. మీ వల్ల సినిమా ఆగిపోతోంది.. పరిష్కరించే ప్రయత్నం చేయండని.. కన్నడిగులు శాంతించేలా ఒక బైట్ అయినా ఇవ్వమని రాజమౌళి అండ్ కో ఆయన్ని అడిగినట్లుగా తెలుస్తోంది. ఐతే అలాంటి ప్రకటన ఏదైనా చేస్తే తమిళనాడు జనాల దృష్టిలో తాను ద్రోహినైపోతానని.. ఇక్కడి ప్రయోజనాలు తనకు కీలకమని.. కాబట్టే ఈ విషయంలో తాను ఏం స్పందించనని.. మౌనం పాటిస్తానని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. కర్ణాటకలో బాహుబలి-2 విడుదల ఆగిపోతే సత్యరాజ్ కు వచ్చిన నష్టమేమీ లేదు.. నష్టపోయేది బాహుబలి టీం అనడాన్ని బట్టి రాజమౌళి సత్యరాజ్ విషయంలో కొంచెం అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ వివాదం విషయమై సత్యరాజ్ తో తాము మాట్లాడామని కూడా రాజమౌళి అన్నాడు. మాట్లాడటం అంటే.. సమస్యను పరిష్కరించమని అడిగినట్లే. ఆయన నో అనబట్టే రాజమౌళి ఇలా వీడియో సందేశం ద్వారా కన్నడిగుల్ని శాంతింపజేసే ప్రయత్నం చేశాడు.