బాహుబలి అంటే కేవలం ఒక హీరో చుట్టూ తిరిగే కథ మాత్రం కాదులే అంటున్నాడు జక్కన్న రాజమౌళి. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కంటే కూడా.. వారు డెవలప్ చేసిన మాహిష్మతి సామ్రాజ్యం అనేది అంత పెద్దదట. అందుకే ఈ సినిమా కేవలం రెండు పార్టులకే పరిమితం కాకుండా.. ఒక ట్రయాలజీ అయ్యే ఛాన్సుందని చెప్పుకొచ్చాడు.
''బాహుబలి కథ చాలా పెద్దది.మాహిష్మతి సామ్రాజ్యం చూస్తే మీకు ఆ విషయం అర్ధమవుతుంది. ఈ కథను కేవలం రెండో పార్టు తీసేసి ఆపేయలేం. అందుకే ఈ కథ కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా సినిమాకు మూడో పార్టు కూడా ఉంటుంది. ఆ పార్టును ఎప్పుడు ఎలా పూర్తి చేస్తానో.. ఏ విధంగా ఆవిష్కరిస్తాను అనేది ఇప్పుడే చెప్పలేను'' అంటూ సెలవిచ్చాడు రాజమౌళి. గతంలో ఇదే విషయం గురించి మాట్లాడిన రాజమౌళి తండ్రి.. బాహుబలి రైటర్ విజయేంద్రప్రసాద్ కూడా.. ''బాహుబలి 3 ఉంటుంది కాని.. బహుశా వేరే ఇతర నటీనటులతో తీసే అవకాశం ఉంది'' అని అన్నారు.
ఈ లెక్కన చూస్తుంటే.. అసలు బాహుబలి కోసం రెడీ చేసిన సెట్స్ కాని.. లేదంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ లో డెవలప్ చేసిన సదరు ఫైల్స్ ను కాని తీసేయకుండా అలాగే ఉంచి మనోళ్ళు మరో రెండు మూడు పార్టులు సినిమాలు చేసేలా ఉన్నారే. సర్లేండి మన దేశంలో అసలు ఇలాంటి ట్రయాలజీలు ఇప్పటివరకు రానే రాలేదు. సో మనోళ్ళు మూడు పార్టు కూడా పక్కా అంటే పక్కా అంటున్నారు కాబట్టి.. హ్యాపీ న్యూసే!!