గత కొన్నేళ్లుగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం ఏమంత బాగుండట్లేదు. మూడేళ్ల కిందట ఒకసారి విదేశాల్లో చాలా రోజులు ఉండి చికిత్స పొందాడు రజినీ. ఆయనకు ఏమైందన్నది బయటి వాళ్లెవరికీ క్లారిటీ లేదు. అప్పట్లో సూపర్ స్టార్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఐతే ఆయన కోలుకుని తిరిగిరావడంతో హమ్మయ్య అనుకున్నారు.
ఐతే మళ్లీ ఈ మధ్య ?కబాలి? సినిమా విడుదలకు ముందు మరోసారి అభిమానుల్ని కలవరపాటుకు గురి చేశాడు రజినీ. రెండు నెలల పాటు అమెరికాలోనే ఉండి చికిత్స తీసుకున్నాడు. అప్పుడు కూడా రకరకాల ఊహాగానాలు నడిచాయి. అభిమానులు మామూలుగా టెన్షన్ పడలేదు. ఐతే ఎట్టకేలకు మళ్లీ ఇండియాలో అడుగుపెట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలో మళ్లీ రజినీ హఠాత్తుగా అమెరికా పయనం అయ్యారన్న వార్త అభిమానుల్ని గందరగోళానికి గురి చేస్తోంది.
?2.0? కొత్త షెడ్యూల్ కోసం శంకర్ అండ్ కో ఉక్రెయిన్ షెడ్యూల్ కు రెడీ అవుతుండగా రజినీ ఉన్నట్లుండి అమెరికాకు పయనమైనట్లు సమాచారం. అనారోగ్య కారణాలతోనే ఆయన అమెరికా వెళ్లారని.. చికిత్స తీసుకున్నాక ఉక్రెయిన్ కు వస్తారని అంటున్నారు. ?2.0? లాంటి భారీ బడ్జెట్ మూవీ చేస్తూ రజినీ ఇలా ఇబ్బంది పడుతుండటం కలవరపరిచేదే. పరిస్థితి చూస్తుంటే రెగ్యులర్ గా షూటింగులో పాల్గొనడానికి రజినీ ఆరోగ్యం సహకరిస్తున్నట్లుగా లేదు. ఈ పరిస్థితుల్లో ?2.0? షెడ్యూళ్లు ఏమవుతాయో చూడాలి.