పవన్ కల్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబోలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం అజ్ఞాతవాసి పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రం....నాన్ బాహుబలి రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే శనివారం విడుదలైన ఈ చిత్ర టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ టీజర్ ను ఇప్పటి వరకు 78.86 లక్షల మంది వీక్షించగా 449001 మంది లైక్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో ఈ టీజర్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ఈ టీజర్ పై పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశసలు కురిపిస్తున్నారు. తాజాగా బాబాయ్ టీజర్ పై అబ్బాయ్ రామ్ చరణ్ - వివాదాస్పద దర్శకుడు (పవన్ కల్యాణ్ అభిమాని) రామ్ గోపాల్ వర్మ తమదైన శైలిలో ప్రశంసలు కురిపించారు.
అజ్ఞాతవాసి గా టీజర్లో పవన్ ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయని పవన్ తన మేనరిజంతో అదరగొట్టాడని వారు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ‘బాబాయ్ ఎట్ హిజ్ బెస్ట్. టీజర్లో ఆయన ప్రతి ఎక్స్ ప్రెషన్ చాలా నచ్చింది. సంక్రాంతి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా అని బాబాయ్ ని అబ్బాయ్ పొగడ్తలతో ముంచెత్తాడు. అజ్ఞాతవాసి టీజర్ అద్భుతంగా ఉందని పీకే (పవన్ కల్యాణ్) అత్యుత్తమంగా కనిపించాడని వర్మ తనదైన శైలిలో కామెంట్ పెట్టాడు. అజ్ఞాతవాసి లో పవన్ సరసన కీర్తి సురేశ్ - అను ఇమ్మాన్యుయేల్ లు నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలనాటి అందాల నటి ఖుష్బూ....ఓ కీలకమైన పాత్ర పోషిస్తోంది. బొమాన్ ఇరానీ - రావు రమేశ్ - మురళీ శర్మ ల పాత్రలు కూడా ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు టాక్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానకి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని అందించాడు.