ఒక జులాయి.. ఒక అత్తారింటికి దారేది.. ఒక సన్నాఫ్ సత్యమూర్తి.. వీటిలో దేని ఫలితం ఏమైనా కావచ్చు. కానీ ఈ నాలుగూ కూడా మ్యూజికల్ గా సూపర్ హిట్లే. మధ్యలో ఖలేజా ను మినహాయిస్తే త్రివిక్రమ్ వరుసగా దేవితోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. దీంతో దేవిని త్రివిక్రమ్ ఆస్థాన సంగీత దర్శకుడు అనడం మొదలుపెట్టారు జనాలు. ఐతే ఆశ్చర్యకరంగా గత ఏడాది అఆ సినిమాకు మిక్కీ జే మేయర్ ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు మాటల మాంత్రికుడు.
అప్పటికి దేవి డేట్లు అందుబాటులో లేవేమో అనుకుంటే.. పవన్ కళ్యాణ్ సినిమాకు కూడా అతడిని పక్కన పెట్టేశాడు. అనిరుధ్ ను ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు కూడా అతడినే కొనసాగించడం ఇంకా ఆశ్చర్యకరం. మొన్న త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా దేవి అతడికి శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడం చర్చనీయాంశమైంది. అదే రోజు కమల్ హాసన్ కు విష్ చేసి త్రివిక్రమ్ ను మరిచిపోవడాన్ని బట్టి ఇద్దరి మధ్య ఏదో తేడా జరిగిందనే విషయం అందరికీ అర్థమైంది.
ఐతే దేవి.. త్రివిక్రమ్ మధ్య ఈ గ్యాప్ రావడానికి పవన్ కళ్యాణ్ కారణమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్యూర్లో దేవి పాత్ర కూడా ఉందని పవన్ భావిస్తున్నాడట. కొన్నిసార్లు ఔట్ పుట్ తేడా కొట్టినప్పటికీ తన సంగీతంతో సినిమాను పైకి లేపగల సామర్థ్యం దేవి సొంతం. జల్సా విషయంలో అలాగే చేశాడతను. ఆ రకంగా సర్దార్ గబ్బర్ సింగ్ కు ఎక్స్ ట్రా ఎఫర్ట్ పెట్టలేదని పవన్ కినుక వహించాడట.
తాను ప్రత్యేకంగా అడిగినా కూడా చాలా మామూలు ఆల్బమ్ ఇచ్చాడని పవన్ డిజప్పాయింట్ అయ్యాడట. ఈ నేపథ్యంలోనే దేవిని పక్కన పెట్టమని తన మిత్రుడు త్రివిక్రమ్ కు పవన్ చెప్పినట్లు సమాచారం.