చిరంజీవి కొత్త సినిమా సై రా మోషన్ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర నిర్మాత రామ్ చరణ్ హాజరయ్యాడు. చిరంజీవి బావ అల్లు అరవింద్ వచ్చాడు. మెగా ఫ్యామిలీకి చెందిన యువ కథానాయకులు వచ్చారు. చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి.. రచయితలు పరుచూరి బ్రదర్స్ వచ్చారు. అందరికీ మించి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా వచ్చాడు. వీళ్లందరితో ఈ వేడుక కళకళలాడింది. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ వేడుకలో కనిపించకపోవడం ఆశ్చర్యమే. ఇది మెగా అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. స్టన్నింగ్ గా అనిపించిన మోషన్ పోస్టర్ ను లాంచ్ చేసే సమయంలో చిరు లేని లోటు స్పష్టంగా కనిపించింది.
ఈ వేడుకకు రాని చిరు.. కేవలం వీడియో సందేశంతో సరిపెట్టాడు. ఇంతకుముందు తన 60వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా చేసినపుడు కూడా చిరు ఇలాగే చేశాడు. అప్పుడు ఆ వేడుకను చిరు అవాయిడ్ చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా అలాగే బంక్ కొట్టడం అభిమానులకు రుచించలేదు. ఇది ఆయన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా. ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. పోనీ చిరు అందుబాటులో లేకుండా విదేశాల్లో ఏమైనా ఉన్నారా అంటే అదీ లేదు. హైదరాబాద్ లోని ఇంట్లోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్.. సాయిధరమ్ తేజ్ తదితరులు చిరును ఇంటికెళ్లి కలిసి వచ్చారు.