వర్మకు పూరి జగన్నాథ్ ఎంతటి ప్రియ శిష్యుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హైదరాబాద్ లో ఉన్నపుడు వర్మ మెయింటైనెన్స్ అంతా పూరీనూ చూసుకుంటాడన్న రూమర్ టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంటుంది. తన శిష్యుడు తీసిన చెత్త సినిమాల్ని కూడా వర్మ తెగ పొగిడేస్తూ వాటిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో తన శిష్యుడు డ్రగ్స్ రాకెట్లో ఇరుక్కుని పోలీసుల నోటీసులందుకోవడంతో పాటు విచారణకు కూడా హాజరవడంపై వర్మ స్పందించడం.. డ్రగ్స్ కేసును విచారిస్తున్న అకున్ సబర్వాల్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్.. సుబ్బరాజులను విచారించినట్లు.. సిట్ నోటీసులు అందుకున్న స్కూలు పిల్లల్ని కూడా 12 గంటల పాటు విచారిస్తారా.. కేవలం విచారణేనా.. అని వర్మ ప్రశ్నించడం విశేషం. ఎక్సైజ్ శాఖ ఎప్పట్నుంచో ఉందని.. ఐతే సినిమా వాళ్ల పేర్లు బయట పెట్టడం వల్లే ఆ శాఖ పేరు తొలిసారిగా ఇప్పుడు మార్మోగిపోతోందని.. తమ పని తనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు సినీ రంగాన్ని టీజర్.. ట్రైలర్ల మాదిరి ఎక్సైజ్ శాఖ వాడుకుందని వర్మ సెటైర్ వేయడం విశేషం. డ్రగ్స్ కేసులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ బయట పెట్టినా పెట్టకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న వర్మ.. అకున్ సబర్వాల్ ను మీడియా అమరేంద్ర బాహుబలి లాగా చూపిస్తోందని.. రాజమౌళి సబర్వాల్ ను కథానాయకుడిగా పెట్టి ‘బాహుబలి-3’ తీస్తాడేమో అని వర్మ ఎద్దేవా చేశాడు.