మనిషి చచ్చిపోయాడని.. లేదంటే చావు బ్రతుకుల మద్యన ఉన్నాడని.. అప్పుడెప్పుడో సరైన కమ్యూనికేషన్ వ్యవస్థ లేని టైములో రూమర్లు వచ్చినా ఒక అర్ధం ఉండేది కాని.. ఇప్పుడు యావత్ ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ గా మారిపోయిన తరువాత కూడా అలాంటి రూమర్లే రావడం దురదృష్టకరం. వాటిని కాస్త కూడా వెరిఫై చేయకుండా మీడియాల్లో వార్తలు వచ్చేయడం ఇంకా దౌర్భాగ్యం అనే చెప్పాలి.
బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ చచ్చిపోయాడని ఇప్పటికి ఓ నాలుగుసార్లు రచ్చ జరిగింది. స్వయంగా ఆయన ట్విట్టర్లో నేను బ్రతికే ఉన్నానహో అంటూ స్టేట్మెంట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ జబ్బు టాలీవుడ్ కు కూడా పాకిపోయి.. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కు అస్సలు ఒంట్లో బాలేదని.. ఆయన అపోలో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నాడని ఒక వార్త సంచలనం అయిపోయింది. కట్ చేస్తే.. అసలు ఇవన్నీ కేవలం రూమర్లే. ప్రస్తుతం బెమ్మి సారు అమెరికాలో మంచు విష్ణుతో కలసి 'ఆచారి అమెరికా యాత్ర' అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడట. ఆయన ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని అంటున్నారు.
ఆ లెక్కన చూసుకుంటూ బ్రహ్మీ సేఫ్ కాబట్టి.. ఆయన ఆరోగ్యంపై జోకులు లాంటి రూమర్లను వేస్తున్న మీడియాలు ఇక ఆపేయాల్సిందే. ఆ మధ్యన వరుణ్ సందేశ్ భార్య.. హీరోయిన్ వితిక కూడా సూసైడ్ ఎటెంప్ట్ చేసిందని ఇదే తరహాలో మెయిన్ స్ర్టీమ్ మీడియాలో రూమర్లను ప్రచారం చేశాయి.