మనం చిత్రంలో నాగేశ్వరావు - నాగార్జున - నాగచైతన్య - అఖిల్ ను చూశాం. అఖిల్ సినిమాలోనూ నాగార్జున - తన తనయులతో కలసి ఓ పాటలో స్టెప్పులేశారు. ఈ విధంగా ఏవో చిన్న చిన్న పాత్రల్లోనో పాటల్లోనో కనిపించడం తప్ప పూర్తి స్థాయి క్యారెక్టర్స్ ఏ సినిమాలోనూ ఇప్పటి వరకూ చేయలేదు. తండ్రీ కొడుకులు కలసి ఓ సినిమాలో నటిస్తే బాగుంటుందని అక్కినేని అభిమానులు చాలా కాలం నుంచి ముచ్చటపడుతున్నారు. ఇప్పుడా ముచ్చట తీరనుంది. ఈ ముగ్గురు కలసి నటించడం లేదు కానీ నాగార్జున - నాగచైతన్య కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని సమాచారం.
కాగా ఈ చిత్రానికి 'శతమానం భవతి'తో దర్శకుడిగా పరిచయమైన సతీష్ వేగేశ్న డైరెక్షన్ చేయనున్నాడట. 'శతమానం భవతి'లాగే మరో కుటుంబ కథా చిత్రం తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు రచయిత. దీనికి తోడు కుటుంబ కథా చిత్రాలను తీసే దిల్ రాజు నిర్మాత అని తెలుస్తోంది.
ప్రస్తుతం నాగార్జున 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి డేట్లు కుదిరితే సినిమా మొదలవుతుందని టాక్. అయితే.. అభిమానులు మాత్రం దీనిపై ఇంకా ఎక్కువ ఆవిస్తున్నారట. ఎలాగూ చైతూకు - సమంతకు పెళ్లవబోతోంది కదా ఇందులో సమంతనే హీరోయిన్ గా పెడితే తండ్రి - కొడుకు - కోడలు కూడా నటించినట్లవుతుందని అంటున్నారట. వీరందరి సంగతి ఎలా ఉన్నా సతీశ్ వేగేశ్న మాత్రం గట్టి ప్రాజెక్టే పట్టినట్లున్నాడు.