ఎ ఫిలిం బై అరవింద్ సినిమాతో దశాబ్దం కిందట ప్రకంపనలు రేపాడు శేఖర్ సూరి. తొలి సినిమా అదృష్టం అతడికెలాంటి అదృష్టాన్ని తెచ్చిపెట్టకపోయినా.. రెండో సినిమాగా ఎ ఫిలిం బై అరవింద్ తీసి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు శేఖర్. యునీక్ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రం ఓ వర్గం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. దీని తర్వాత పునర్జన్మల నేపథ్యంలో అతను తీసిన ‘త్రీ’ విభిన్నమైన చిత్రంగా పేరు తెచ్చుకుంది కానీ.. ప్రేక్షకుల అంచనాల్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆపై శేఖర్ ఎ ఫిలిం బై అరవింద్ కు సీక్వెల్ చేశాడు. కానీ అది కూడా నిరాశ పరచడంతో శేఖర్ కెరీర్లో బాగా గ్యాప్ వచ్చేసింది.
ఐతే సుదీర్ఘ విరామం తర్వాత ఈ విలక్షణ దర్శకుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శేఖర్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా డాక్టర్ చక్రవర్తి. ఎ ఫిలిం బై అరవింద్.. త్రీ సినిమాల్లో హీరోగా చేసిన రిషినే ఇందులోనూ కథానాయకుడిగా నటిస్తున్నాడు. తన గత సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుందని.. ఇది హ్యూమన్ ఎమోషన్స్ మీద నడుస్తుందని.. కొత్తదనానికి ఢోకా ఉండదని అన్నాడు శేఖర్. విశేషం ఏంటంటే.. శేఖర్ బాలీవుడ్లోనూ ఒక సినిమా చేస్తున్నాడు. దాని పేరు.. గ్యాంగ్స్ ఆఫ్ బెనారస్. అనురాగ్ కశ్యప్ తీసిన గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ తరహాలో మాఫియా నేపథ్యంలో సాగుతుందట ఈ చిత్రం.