లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. అనామిక లాంటి ఫ్లాపులతో రెండు మూడేళ్ల పాటు అడ్రస్ లేకుండా పోయాడు శేఖర్ కమ్ముల. ఐతే కొన్ని నెలల కిందటే ఫిదా సినిమాతో మళ్లీ తనేంటో రుజువు చేశాడతను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయి మళ్లీ ఇండస్ట్రీ మొత్తం కమ్ముల వైపు చూసేలా చేసింది. ఆయనతో సినిమా చేయడానికి చాలామంది హీరోలు ఆసక్తితో ఉన్నారు. ఐతే కమ్ముల మాత్రం తన తర్వాతి సినిమాకు రానా దగ్గుబాటిని కథానాయకుడిగా ఎంచుకున్నట్లు సమాచారం. రానా హీరోగా పరిచయమైందే కమ్ముల తీసిన లీడర్ సినిమాతో అన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో లీడర్-2 వస్తుందని ప్రచారం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
ఐతే శేఖర్ ఇప్పుడో కొత్త కథతో రానాను సంప్రదించాడట. ముందు నితిన్ లేదా విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకున్న కమ్ముల.. చివరికి రానానే సంప్రదించినట్లు సమాచారం. రానా కూడా ఈ సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రానా డేట్లు ఎప్పుడిస్తాడన్నదాన్ని బట్టి సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలుస్తుంది. పూర్తి స్క్రిప్టు రెడీ కావడానికి కూడా రెండు మూడు నెలలు పట్టొచ్చని అంటున్నారు. ఈ చిత్రాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో కూడా ఇంకా తేలలేదు. సమకాలీన అంశాలతో ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేశాడట కమ్ముల. రానా-శేఖర్ కాంబినేషన్లో లీడర్ వచ్చే సమయానికి ఆ సినిమాపై అంత క్రేజ్ లేదు. కానీ ఇప్పుడు రానా పెద్ద స్టార్ అయిపోయాడు. కమ్ముల కూడా ఫిదా తో ఊపులోకి వచ్చాడు.