తెరపై వివిధ పాత్రలను పోషిస్తూ స్టార్ డమ్ తెచ్చుకున్న కథానాయకులు .. కథానాయికల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి సహజంగానే కుర్రకారు ఉత్సాహాన్ని చూపుతుంటుంది. ముఖ్యంగా వాళ్ల మధ్యగల లవ్ ఎఫైర్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా వుంటుంది. అందువల్లనే ఇప్పటికీ శింబూ - నయనతారల ప్రేమకథ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే వుంటుంది. అసలు వాళ్ల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ఎందుకు అది వాడిపోయింది? అనే విషయంగా ఒక సినిమాను కూడా రూపొందించే స్థాయికి వాళ్ల ప్రేమ వెళ్లింది.
ఈ సినిమాలో తన పాత్రని తానే పోషించడానికి శింబూ సిద్ధపడ్డాడు. నందు దర్శకత్వంలో 'కెట్టవన్' (చెడ్డవాడు) పేరుతో లేఖ వాషింగ్ టన్ కథానాయికగా కొంతకాలం క్రితం ఈ సినిమా కొంతభాగం షూటింగ్ జరుపుకుంది. ఆ తరువాత అనివార్య కారణాల వలన ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు శింబూయే కథానాయకుడిగా మరో కథానాయికతో మళ్లీ ఈ ప్రేమకథను తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త వినిపిస్తోంది. అదే నిజమైతే ఈ విషయంపై నయనతార ఎలా స్పందిస్తుందోననేది ఆసక్తికరంగా మారింది.