ఇద్దరు హీరోయిన్లు ఒకే సినిమాలో నటిస్తే ఇక ఆ చిత్ర దర్శక నిర్మాతలకి ఇబ్బందే! నా పాత్ర తగ్గించారంటూ ఒకరు... ఆమె పాత్ర పెంచేశారంటూ మరొకరు... ఇలా కోపతాపాలు ప్రదర్శిస్తూ వుంటారు. గతంలో జయప్రద ... శ్రీదేవి ... జయసుధల మధ్య ఇలాంటి ఇగో సమస్యలే వచ్చి, వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకోవడం కూడా మానేశారు. ఇక అసలు విషయానికి వస్తే, త్రిభాషా నటి శ్రుతి హాసన్ ఇప్పుడు లక్ష్మీ మీనన్ పై ఇలాంటి విషయంలోనే కారాలు మిరియాలు నూరుతోందట. వీరిద్దరూ కలసి ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అజిత్ హీరో. ఇందులో హీరోకి చెల్లిగా లక్ష్మీ మీనన్ నటిస్తోంది.
అన్నా చెల్లెళ్ల అనుబంధంతో సాగుతున్న ఈ చిత్రంలో అజిత్, లక్ష్మీలపైనే మంచి మంచి సీన్స్ వున్నాయట. ఇదే విషయాన్ని లక్ష్మీ మీనన్ అందరి దగ్గరా చెబుతూ, ఇందులో తన పాత్రే హైలైట్ అవుతుందని, శ్రుతి కేవలం పాటలకే పరిమితమనీ గొప్పలు పోతోందట. ఈ విషయం కాస్తా ఇప్పుడు శ్రుతి చెవిన పడడంతో లక్ష్మిపై ఆమె గుర్రుగా వుంది. దాంతో ఆమెపై సెట్లో ఫైర్ అవుతోందని, ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందోనని నిర్మాత భయపడుతున్నాడు. మరి, ఇక అజిత్ కలగజేసుకుని రాజీ కుదర్చాలని కొందరంటున్నారు.