రామ్ చరణ్.. సురేందర్ రెడ్డితో ధృవ మూవీని దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు తెచ్చేశాడు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మినహాయిస్తే టాకీ పార్ట్ అంతా పూర్తయిపోయిందని ఇప్పటికే యూనిట్ చెప్పేసింది కూడా. ఆడియో ఫంక్షన్.. రిలీజ్ లకు సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు జరుగుతుంటే.. చరణ్ తో సినిమా మొదలు పెట్టేసేందుకు సుకుమార్ కూడా సిద్ధమైపోయాడు.
నవంబర్ రెండో వారంలోనే చెర్రీ మూవీ స్టార్ట్ చేసేయాలన్నది దర్శకుడు సుకుమార్ ఆలోచన. అయితే.. ఇప్పుడీ ప్రాజెక్టులోకి సినిమాటోగ్రాఫర్ రత్నవేలును తీసుకున్నారని తెలుస్తోంది. ముందుగా మనోజ్ పరమహంసకు ఈ బాధ్యతలు అప్పగిస్తారని భావించినా.. సుకుమార్ మాత్రం తనకు బాగా క్లోజ్ అయిన రత్నవేలు వైపే మొగ్గాడట. ఈయన కూడా ఓకే చెప్పేసినా.. డిసెంబర్ వరకూ తను రాలేనని అన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెగా మూవీ ఖైదీ నెంబర్ 150 షూటింగ్ లో ఉన్న రత్నవేలు.. డిసెంబర్ రెండో వారం నాటికి పూర్తిగా ఫ్రీ అయిపోనున్నాడు.
రత్నవేలు కోసం నెల రోజులు ఆగాలని సుకుమార్-రామ్ చరణ్ లు నిర్ణయించారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి పూర్తి చేసేసి.. మే నెల చివర్లోనే ఈ మూవీ రిలీజ్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తో ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలైపోగా.. రామ్ చరణ్ ఈ సినిమాతో విలేజ్ కామెడీ పండించనున్నాడని సన్నిహితులు చెబుతున్నారు.