భీమనేని శ్రీనివాసరావు తర్వాత రీమేక్ సినిమాలకు ప్రసిద్ధి చెందిన దర్శకుడు. తొలి సినిమా భీమిలి కబడ్డీ జట్టు.. ఆ తర్వాత చేసిన ఎస్ఎంఎస్.. శంకర రీమేక్ చిత్రాలే. ఇప్పుడు తొలిసారిగా డైరెక్ట్ మూవీతో వస్తున్నాడతను. అదే.. వీడెవడు. ముంబయి బుల్లోడు సచిన్ జోషి హీరోగా నటించిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందించాడు సత్య. కథ.. స్క్రీన్ ప్లే అన్నీ అతనే సమకూర్చుకున్నాడు. శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాతో తన రియల్ టాలెంట్ ఏంటో చూపిస్తానని.. దర్శకుడిగా మంచి అవకాశాలు అందుకుంటానని అంటున్నాడు తాతినేని సత్య. ఈ సినిమా తర్వాత నానితో సినిమా చేయడానికి తాను సిద్ధమవుతున్నట్లు చెప్పాడు సత్య.
నాని కోసం ఇప్పటికే కథ రాసి రెడీగా పెట్టుకున్నానని.. వీడెవడు రిలీజయ్యాక నానికి కథ వినిపిస్తానని.. అతడికి ఆ కథ నచ్చి తనతో సినిమా చేస్తాడన్న నమ్మకం ఉందని చెప్పాడు తాతినేని సత్య. ఇతడి తొలి సినిమా భీమిలి కబడ్డీ జట్టు లో నానినే హీరో అన్న సంగతి తెలిసిందే. మరి నాని ఇప్పుడున్న స్థాయికి అప్పటి పరిచయంతో సత్యతో సినిమా చేయడానికి ఒప్పుకుంటాడా అన్నది డౌటు. అసలు నాని ఇప్పుడున్న బిజీ టైంలో కథ వినడానికైనా ఒప్పుకుంటాడా అన్నదీ సందేహమే. వీడెవడు సినిమాపై ఇటు తెలుగులో కానీ.. అటు తమిళంలో కానీ ఎలాంటి అంచనాల్లేవు. సచిన్ సరదా తీర్చుకోవడానికి సినిమాలు చేస్తాడన్న ఫీలింగ్ ఉంది జనాల్లో. తెలుగు ప్రేక్షకులు అతడినెప్పుడూ ఓన్ చేసుకోకపోయినా.. ఇక్కడే మళ్లీ మళ్లీ సినిమాలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.