తెలుగు, తమిళ ప్రేక్షకులు కొంతకాలంగా సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దాంతో అలాంటి నేపథ్యం కలిగిన కథలను కొత్తగా మలచుకుని ఆసక్తికరంగా ఆవిష్కరించడానికి దర్శకులు ప్రయత్నిస్తున్నారు. ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధిస్తున్నారు. అలా అంజలి ప్రధాన పాత్రగా 'గీతాంజలి' సినిమాతో హిట్ కొట్టిన రాజ్ కిరణ్ 'స్వాతి' ప్రధాన పాత్రగా 'త్రిపుర' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఒక వైపున ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతూ ఉండగా, హైదరాబాదులో దర్శకుడు వినాయక్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.
త్రిపుర అంతరంగాన్ని ఆమె కళ్లను చూసి అర్థం చేసుకోవాలి అన్నట్టుగా అంతవరకే రివిల్ చేశారు. క్రేజీ మీడియా పతాకంపై నిర్మించబడుతోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, అంజలి కథానాయికగా చేసిన 'గీతాంజలి' సినిమా కంటే, 'త్రిపుర' సినిమా ప్రేక్షకులను మరింత భయపెడుతుందని చెప్పారు. అడుగడుగునా ఉత్కంఠభరిత సన్నివేశాలు ... ఆకట్టుకునే పాటలు ఈ సినిమాని విజయపథం వైపు నడిపిస్తాయని చెప్పారు. ఇప్పటి వరకూ అల్లరి పిల్లలా అలరిస్తూ వచ్చిన స్వాతి, త్రిపురగా ప్రేక్షకులను ఎలా భయపెట్టనుందనేది ఆసక్తికరంగా మారింది.