ఒక వైపున 'సోగ్గాడే చిన్నినాయన' అనిపించుకుంటూ పల్లెటూరి లోకేషన్లలోని షూటింగులో పాల్గొంటూ వచ్చిన నాగార్జున, తన తదుపరి చిత్రం కోసం విదేశాలకి ప్రయాణం కట్టనున్నాడు. కార్తీ కాంబినేషన్లో ఆయన మల్టీస్టారర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులకి ఆనందాశ్చర్యాలను కలిగించడంలో భాగంగా ఇటీవల దర్శక నిర్మాతలు విదేశీ లోకేషన్లకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. అలా నాగ్ .. కార్తీ మల్టీ స్టారర్ చిత్రం షూటింగ్ కూడా విదేశాల్లోనే ప్లాన్ చేశారు.
జూలై రెండోవారం నుంచి దాదాపుగా 30 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ బెల్గ్రేడ్ .. పారిస్ .. ఫ్రాన్స్ .. తదితర ప్రాంతాల్లో జరగనుంది. పారిస్ లో చిత్రీకరించనున్న యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ షెడ్యూల్లో నాగార్జున .. కార్తీ .. తమన్నా .. మరికొందరు ముఖ్య పాత్రధారులు పాల్గొననున్నట్టు తెలుస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాకి ప్రసాద్ వి.పొట్లూరి నిర్మాతగా .. వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.