మొదటి నుంచి కూడా వెంకటేష్ రీమేక్ చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెడుతూ వచ్చాడు. ఈ ప్రయత్నంలో ఆయన ఎన్నో విజయాలను అందుకున్నాడు కూడా. తాజాగా ఆయన నటించిన 'గోపాల గోపాల' రీమేక్ కూడా విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి కథలు వింటున్నాడుగానీ, ఆయనకి ఏవీ నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన దృష్టి బాలీవుడ్ తాజా చిత్రం 'పీకూ' మీద పడినట్టు ఒక వార్త షికారు చేస్తోంది. ఈ సంవత్సరం భారీ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాలలో 'పీకూ' మూడవ స్థానంలో నిలిచింది.
ఈ సినిమా కథా కథనాలు .. పాత్రల తీరుతెన్నులు వెంకటేష్ కి నచ్చడంతో తెలుగు రీమేక్ గురించిన ఆలోచనలో పడినట్టు చెబుతున్నారు. హిందీలో అర్బాజ్ ఖాన్ పోషించిన పాత్రలో వెంకటేష్, ఆయన జోడీగా సమంతా నటించే అవకాశం వుందని అంటున్నారు. అక్కడ అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రను ఇక్కడ ఎవరు చేస్తారనే విషయమే సందిగ్ధంలో పడిందట. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం వుంది.