హైదరాబాద్: చిరంజీవి సుప్రీమ్ హీరో నుండి మెగాస్టార్ గా ఎదుగుతున్న తరుణంలో కొన్ని భారీ హిట్స్ అందించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి- విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన 'గ్యాంగ్ లీడర్'తో పాటు పలు సినిమాలు అప్పట్లో బాక్సాఫీసు సెన్సేషన్ గా నిలిచాయి. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ విజయశాంతి చిరంజీవితో కలిసి 150వ సినిమాలో నటించబోతోందని తెలుస్తోంది.
దాదాపు 12 సంవత్సరాలుగా విజయశాంతి సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్న ఆమెపై దర్శకుడు వివి వినాయక్ దృష్టి పడింది. చిరంజీవి 150వ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర ఆమెతో చేయించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ మేరకు ఇటీవల విజయశాంతిని వివి వినాయక్ టీం కలిసినట్లు సమాచారం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాలో ప్రత్యేక పాత్ర గురించి ఆమెకు వివరించారని, పాత్ర బాగుండటంతో వారి ప్రతిపాదనకు విజయశాంతి కూడా పాజిటివ్ గానే స్పందించారని అంటున్నారు. అయితే విజయశాంతి ఇంకా సైన్ చేయలేదని, రెండ్రోలు ఆలోచించి చెబుతానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే విజయశాంతి పాత్ర ఎలా ఉండబోతోంది? అనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఆమె పాత్ర మాత్రం చాలా ప్రాధాన్యతతో కూడి ఉంటుందని మాత్రం అంటున్నారు. మరో వైపు ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. నయనతారే ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. జులై 18 నుండి సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.