మంచు విష్ణు రీసెంట్ గా లక్కున్నోడు చిత్రాన్ని థియేటర్లలోకి తెచ్చాడు. ఫన్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీలో.. ప్రధానమైన సన్నివేశాలు మరీ అసలు లాజిక్ కి అందకుండా ఉండడం లోపంగా చెప్పుకుంటున్నారు. అది మినహాయిస్తే.. ఎంటర్టెయిన్మెంట్ వరకూ ఓకే అనిపించుకున్నాడు లక్కున్నోడు. ఇప్పుడు నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో కూడా స్పీడ్ పెంచాడు విష్ణు.
రాజ్ తరుణ్ తో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు చిత్రాన్ని తీసిన దర్శకుడు గవిరెడ్డితో.. మంచు విష్ణు ఓ ప్రాజెక్టును ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈడోరకం ఆడోరకం తర్వాత.. ఈ ఇద్దరు హీరోలకు మంచి సాన్నిహిత్యం ఏర్పడ్డ సంగతి తెలిసిందే. గవిరెడ్డితో మంచు విష్ణు మూవీని.. ఓ నవల ఆధారంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మేడ మీద అబ్బాయి అనే నవలను మూవీగా మలచాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ దశలో ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కొంత సమయం పడుతుందట. మంచు విష్ణు ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉండడమే దీనికి కారణం. అయితే.. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రారంభించాలని చూస్తున్నాడట మంచు విష్ణు.