కర్మ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా పరిచయమై ఆ తర్వాత పూర్తి స్థాయి నటుడిగా మారిపోయారు అడవి శేష్. పంజా, బలుపు, రన్ రాజా రన్ లలో కీలక పాత్రల్లో నటించి ఆ తర్వాత హీరోగా దొంగాట, క్షణం సినిమాలతో మంచి విజయాలనే అందుకున్నారు. ఇక హీరోగా వచ్చిన ఈ క్రేజ్ను అలాగే కొనసాగించే ఉద్దేశంతో శేష్, ప్రస్తుతం రెండు సినిమాలను సెట్స్పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. ?క్షణం?కు స్వయంగా తానే కథ అందించిన శేష్, ఈ రెండు సినిమాలకూ స్క్రిప్ట్ సమకూరుస్తున్నారట.
ఇక ఈ రెండు సినిమాల్లో ఒకటి ఆగష్టులో సెట్స్పైకి వెళ్ళనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు అడివి శేష్ దర్శకత్వం కూడా వహిస్తారన్న ప్రచారం జరిగినా, మాకు అందిన సమాచారం మేరకు శేష్, కేవలం నటనపైనే శ్రద్ధ పెట్టాలన్న ఆలోచనతో దర్శకత్వం చేయట్లేదని తెలుస్తోంది. ఓ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందట. ఇక ఈ సినిమాలకు దర్శకులు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.