తెలుగు తెరపై విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ వరుస విజయాలను అందుకుంటోన్న యువ కథానాయకుడు నిఖిల్. తాను పోషించే ప్రతి పాత్రను ఉత్సాహంతో ఉరకలు వేయించే నిఖిల్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ వుంది. ఆయన తాజా చిత్రం 'శంకరాభరణం' చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఆయనకి జోడీగా కొంతమంది కథానాయికల పేర్లు వినిపించాయి. చివరికి ఈ అవకాశం 'నందిత'ను వరించింది. 'నీకు నాకు డాష్ డాష్' చిత్రంతో తెలుగుతెరకి పరిచయమైన నందిత, 'ప్రేమ కథా చిత్రం'తో విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' సినిమా చేస్తోన్న నందిత, తాజాగా 'శంకరాభరణం' సినిమాలో నాయికగా ఎంపిక అయింది. క్రైమ్ కామెడీ కథాంశంతో కోన వెంకట్ నిర్మాణంలో ఉదయ్ నందనవనం దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నెల 15వ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తన విజయాల జాబితాలో ఈ సినిమా కూడా చోటు సంపాదించుకుంటుందనే బలమైన విశ్వాసంతో నిఖిల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టాలనే కోరుకుందాం.